‘గణతంత్ర’ ఏర్పాట్లపై సీఎస్‌ రివ్యూ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 26వ తేదీ పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో గవర్నర్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. భద్రతా బందోబస్తుతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్‌భవన్‌, సచివాలయం, శాసనసభ, హైకోర్టు సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ భవనాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని ఆర్‌అండ్‌బి శాఖను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు చెప్పారు. అంబులెన్స్‌లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖకు సూచించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణ, ఆహ్వానితులందరికీ తాగునీటి సరఫరా చేపట్టాలని పురపాలకశాఖ అధికారులకు చెప్పారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, పొలిటికల్‌ సెక్రటరీ రఘునందన్‌రావు, హౌంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జితేందర్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ నాగిరెడ్డి, గవర్నర్‌ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.