మేడారం పనుల నాణ్యతపై రాజీలేదు

– జాతీయ హోదాకు మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలి : మంత్రులు డాక్టర్‌ ధనసరి సీతక్క, కొండా సురేఖ
నవతెలంగాణ – ములుగు
మేడారంలో అభివృద్ధి పనుల విషయంలో రాజీపడేది లేదని, కాంట్రాక్టర్లు నాణ్యత పాటించేలా అధికారులు చూడాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క అన్నారు. జాతరలో అభివృద్ధి ఉచిత బస్సు సౌకర్యాన్ని మేడారం జాతరకు వచ్చే మహిళలందరికీ వర్తింపజేస్తామని చెప్పారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మేడారం మహా జాతరపై అధికారులతో దేవాదాయ, అటవీశాఖ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందుగా మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అయిన మేడారం జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లోనే రూ.75కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. మేడారం ప్రాంతంలో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని, మేడారం నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. మరిన్ని నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరగా రూ.35కోట్లు మంజూరు చేసిందన్నారు. భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. అభివృద్ధి పనుల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లకు వంత పాడే అధికారులపై చర్యలు చేపడుతామని హెచ్చరించారు. రాబోయే జాతరలో మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డలుగా మంత్రి సురేఖతో పాటు తాను దిగ్విజయం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి జాతీయ హోదా కోసం కృషి చేయాలని కోరారు.
జాతర విజయవంతానికి కృషి
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వరంగల్‌ ఆడబిడ్డలుగా జాతరను విజయవంతం చేస్తామన్నారు. అభివృద్ధి పనులన్నింటినీ 100 శాతం నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్పారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పనులు పూర్తి చేయిస్తామన్నారు. దేవాలయ శాఖ నుంచి రూ.కోటి 50లక్షలతో పూజారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు లేదని, సలహాలు, సూచనలు అందించి జాతర విజయవంతానికి సహకరించాలని అన్నారు. గిరిజన జాతరలో పూజారుల పాత్ర కీలకమని, వారి కోసం ప్రభుత్వం 10గదులతో అతిథిగృహ నిర్మాణం చేపడుతుందని అన్నారు. వచ్చే మినీ జాతర నాటికి అతిథి గృహాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్‌, అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, ఐటీడీఏ పీఓ అంకిత్‌, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) పి.శ్రీజ, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వేణుగోపాల్‌, దేవాదాయశాఖ కమిషనర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.