– మిల్లర్లు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణమిస్తాం
– ఆర్ఆర్ యాక్ట్ క్రింద 125 శాతం రికవరీ చేస్తాం
– రైస్ మిల్లర్లకు తేల్చి చెప్పిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
నవతెలంగాణ-మెదక్
సీఎంఆర్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని, మిల్లర్ల అలసత్వాన్ని తీవ్రంగా పరిగణమిస్తామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శనివారం ఐడిఓసి వీడియో సమావేశ మందిరంలో జిల్లాలో అధిక శాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చిందని, అప్పటిలోగా బియ్యం పెట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ క్రింద స్థిర చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. 13 నెలలు గడుస్తున్నా మిల్లర్లు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణమిస్తామని హెచ్చరించారు. సీఎంఆర్ కేటాయింపులపై కూలంకషంగా చర్చించారు. రైతుల నుంచి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి సమకూర్చిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరుపుతూ ఈ నెలాఖరులోగా నిర్దేశిత కోటాకు అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రైస్ మిల్లులో పూర్తి సామర్ధ్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. రికవరీ చేసేటప్పుడు 125 శాతం ఆర్ఆర్ యాక్ట్ క్రింద రికవరీ చేస్తామని హెచ్చరించారు. సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున, ఇకపై మిల్లర్ల అలసత్వాన్ని తాము ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని రైస్ మిల్లులలో సీఎంఆర్ కేటాయింపుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ధాన్యాన్ని కొనుగోలు చేసి అయినా నిర్ణీత గడువులోపు లక్ష్యానికి అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని మిల్లర్లకు తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని రైస్ మిల్లులలో తప్పనిసరిగా పూర్తి స్థాయి సామర్ధ్యానికి అనుగుణంగా కస్టమ్ రైస్ మిల్లింగ్ జరుపుతూ, ఈ నెలాఖరులోగా ఎఫ్సీఐకి నిల్వలు చేరవేయాలని గడువు విధించారు. అవసరమైతే ప్రైవేట్ ధాన్యం మిల్లింగ్కు విరామం ఇచ్చి, సీఎంఆర్ లక్ష్య సాధనపై ప్రత్యేక దష్టిని కేంద్రీకరించాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో బాయిల్డ్ రైస్ నిల్వలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవుపలికారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు నెలకొని ఉంటే జిల్లా యంత్రాంగం తరపున తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తామన్నారు. మిల్లర్లు పంపించే సీఎంఆర్ నిల్వలను వెనువెంటనే దిగుమతి చేసుకునేలా గోడౌన్ల వద్ద కూలీల సంఖ్య పెంచాలన్నారు. మిల్లర్లకు కోరిన వెంటనే గోడౌన్లలో బియ్యం దిగుమతి కోసం ఎక్కడ స్థలం అందుబాటులో ఉంటే అక్కడికి మిల్లర్లను అనుమతించాలని ఎఫ్సీఐ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లరు జిల్లా మేనేజర్ హరికష్ణ, డిసిఎస్ఓ బ్రహ్మరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.