నవతెలంగాణ -శంషాబాద్
విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 5.92కిలోల హెరాయిన్ ను శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక మహిళా ప్రయాణికురాలు లుసాక జాంబియా నుంచి బయలుదేరి హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం మీదుగా సింగపూర్ వెళ్లడానికి ఎయిర్పోర్టుకు వచ్చింది. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండటంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని ఆమె హ్యాండ్ బ్యాగ్ను తనిఖీ చేశారు. డాక్యుమెంట్ హౌల్డర్లో 5.92 కిలోల హెరాయిన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.41.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. స్మగ్లింగ్కు పాల్పడిన మహిళను అదుపులోకి తీసుకొని ఆమెపై ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.