”ఇక్కడ తిరుగులేని ఆర్థిక వాస్తవం ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. ఇంత ఆదాయ, సంపద అస మానతను, సంపదల కేంద్రీకణను చరిత్ర చూడలేదు ” అమెరికా డెమోక్రటిక్ సోషలిస్టు బెర్నీ శాండర్స్ ఆక్స్ఫామ్ 2024 అసమానతల నివేదికకు రాసిన ముందుమాటలో చెప్పిన మాటలివి. దవోస్ ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల సందర్భంగా దీన్ని విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాలు కొందరికి నమ్మశక్యం కానం తగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా సమా జంలో దిగువన ఉన్న సగంమంది కంటే ముగ్గురు ఎక్కువ సంపదలను కలిగి ఉన్నారు. అరవైశాతం మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తు న్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కార్మికుల ఉత్పాదకత భారీఎత్తున పెరిగినప్పటికీ యాభై ఏండ్ల నాటి కంటే అమెరికా కార్మికుల సగటు వేతనాలు నేడు తక్కువగా ఉన్నాయని శాండర్స్ పేర్కొన్నాడు. ఆక్స్ఫామ్ చెప్పినట్లు ఇది ఒక్క అమెరికా సమస్య మాత్రమే కాదు అన్నాడు. 2020 తరువాత ఐదు వందల కోట్ల మంది జనం పేదలుగా మారితే ఐదుగురు కుబేరుల సంపద రెండు రెట్లు పెరిగింది. ఇది ప్రపం చానికి చెడువార్త అన్నాడు. రాబడి, సంపదల అసమానతల తీవ్ర తకు ఒక మచ్చుతునక అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ ఉదంతం. అతగాడు ప్రపంచ కుబేరుల్లో ఒకడు. సంపద విలువ 167.4 బిలియన్ డాలర్లు.దీనిలో 2020 తరువాత పెరిగిన మొత్తమే 32.7బి.డాలర్లు ఉంది.అందుకే దాన్ని ఏం చేయాలో తోచక 550 కోట్ల డాలర్లు ఖర్చుచేసి తన కంపెనీ తయారు చేసిన రాకెట్లో ఆకాశపు అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఆహా ఎంత అదృ ష్టం అనుకున్నాం తప్ప ఆ సొమ్ముతో ఎంతోమంది పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఆలోచించలేకపోయాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వీలు కల్పిస్తున్న ప్రభుత్వా లను విమర్శించే వారు అమెజాన్ అధిపతి పది నిమిషాల పది సెకండ్ల పాటు అంతరిక్షంలో విహరించటానికి అతగాడు చేసిన నలభై అయిదు వేల కోట్ల రూపాయలతో ఒక ఏడాది పాటు దేశ మంతటా మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించవచ్చు. తన కంపెనీలో యూనియన్ ఏర్పాటు చేసుకోవటాన్ని అడుగడు గునా అడ్డుకుంటున్న ఆ ధన మదాంధుడిని ఎప్పుడైనా నిరసిం చారా? తమ కంపెనీ హోల్ ఫుడ్స్ ద్వారా విక్రయించే రొయ్యలను శుద్ది చేసే అతగాడి ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలను విశ్రాంతికి, చివరికి పానీయం కూడా తాగేందుకు సమయం ఇవ్వని పెద్ద మనిషని ఎంతమందికి తెలుసు?
ఈ ప్రపంచం కొద్ది మందికి భూతల స్వర్గం అయితే అత్యధి కులకు భూతాల నిలయం.2020 నాటికి ఉన్న సంపదతో పోలిస్తే బిలియనీర్లు మూడేండ్లలో 34శాతం లేదా 3.3లక్షల కోట్ల డాలర్ల మేర పెంచుకున్నారు. ద్రవ్యోల్బణం వీరికి మూడు రెట్ల సంపదను పెంచింది. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ మేరకు సామాన్యుల జేబుల నుంచి మా యమైంది. సంపదంతా జనాభాలో కేవలం 21శాతం మంది ఉండే ధనికదేశాల్లోనే కేంద్రీకృతమైంది. ప్రయివేటు సంపదల్లో 69శాతం, ప్రపంచ బిలియనీర్లలో 74 శాతం మంది ఇక్కడే ఉన్నారు. ద్రవ్య సంబంధ ఆస్తులలో ప్రపంచం లోని ఒకశాతం మంది వద్ద 43శాతం, ఐరోపాలో 47, ఆసియాలో 50శాతం ఉన్నాయి. 1995-2015 మధ్య కాలంలో 60 ఫార్మా కంపెనీలు పదిగా మారాయి. కేవలం రెండు అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచ విత్తన మార్కెట్లో 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. నాలుగు కంపెనీలు ప్రపంచ పురుగుమందుల మార్కెట్లో 62 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆన్లైన్ ప్రకటనల్లో మూడొంతుల ఖర్చు ఫేస్బుక్, ఆల్ఫాబెట్, అమెజాన్ కంపెనీలకే పోతోంది. వెతు కులాటలో 90శాతం గూగుల్ ద్వారానే జరుగుతోంది. ఎకౌంటింగ్ మార్కెట్లో 74శాతం నాలుగు కంపెనీలదే. గుత్తా ధిపత్యం పెరుగుతున్నదని, అది అసమానతలకు దారితీస్తున్నదని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంగీ కరించినా నివారణకు ఎలాంటి చర్యలూ తీసు కోవటం లేదు. ప్రపంచంలో నిజ వేతనాలు తగ్గు తున్నట్లు, దీంతో అసమానతలు పెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) పేర్కొన్నది. ద్రవ్యో ల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగని కార ణంగా గడిచిన రెండేండ్లలో 79.1 కోట్ల మంది కార్మికులు 1.5లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సవరించటం తప్ప తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడివడిన పదేండ్లలో ఒక్కసారి కూడా కనీస వేతనాలను సవ రించకపోవటం లేదా ముసాయిదా పేరుతో అడ్డు కోవటం తెలిసిందే. ప్రపంచమంతటా ఇదే వైఖరి.
విద్య, వైద్యం వంటి సేవలను వస్తువులుగా మార్చి వాటిని ప్రభుత్వం రంగం నుంచి తప్పించి ప్రయివేటు కార్పొరేట్లు స్వంతం చేసుకొని లాభాలు దండుకోవటం కూడా అసమానతలకు దారితీస్తున్నది. కాలుష్యాల నిరోధ చర్యలు తీసు కోకుండా గతంలో లబ్దిపొందిన కార్పొరేట్లే ఇప్పుడు వాటి నివారణ పేరుతో ప్రభుత్వాల నుంచి పెద్దఎత్తున రాయితీలు, సబ్సిడీలు పొందు తున్నాయి.పేద, మధ్య తరగతి దేశాలు రుణభారంతో సతమతం కావటంతో పాటు తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం పేదల్లో 57 శాతం (240 కోట్ల) మంది పేద దేశాల్లో ఉన్నారు. జీవన పరిస్థితి దిగజారటంతో ప్రపంచమంతటా సమ్మెలు, ఆందోళనలు పెరుగు తున్నాయి. అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నవారు 30దేశాల్లో 2022లో ఆందోళనలు చేశారు. జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా 2023లో 122 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. కరోనా తరువాత కోట్లాది మంది పౌరుల పరిస్థితి పూర్వపు స్థితికి చేరుకోలేదు. 2017-2020తో పోలిస్తే ప్రపంచ అతి పెద్ద కార్పొ రేట్ సంస్థలు 2021, 2022లో 89శాతం లాభాలను పెంచుకు న్నాయి. 2023 తొలి ఆరునెలల వివరాలను పరిశీలిస్తే గత రికార్డు లాభాల చరిత్రను బద్దలు కొడు తున్నట్లు కనిపిస్తున్నది. చమురు, విలాసవస్తువులు, విత్త సంబంధ కంపెనీలకు లాభాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని 0.001శాతం కార్పొరేట్లు అన్ని కార్పొరేట్ల లాభాల్లో మూడోవంతు పొందాయంటే సంపదల కేంద్రీకరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా కంపెనీల్లో 89శాతం వాటాలు తెల్లవారి చేతుల్లో ఉండగా ఆఫ్రికన్లకు 1.1, హిస్పానిక్లకు 0.5శాతం ఉన్నాయి. పదకొండు శాతం మంది ప్రపంచ బిలియనీర్లు అధికారంలో లేదా రాజకీయ నేతలుగా ఉన్నారు.గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో 30 ఐరోపా దేశా లలో మూడు వేల విధానపరమైన ప్రతిపాదనలను పరిశీలించగా ధనికులు మద్దతిచ్చిన వాటినే అమలు జరిపారు తప్ప పేదల వాటిని పట్టించుకోలేదు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) జరిపిన పరిశోధ నలో కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యం పెరగటం వలన అమెరికా లోని వస్తు ఉత్పాదక రంగంలో 76శాతం మంది కార్మికుల ఆదా యాలు తగ్గాయని తేలింది. ఈ సంస్థలు, కార్మికుల వేతనాలనే కాదు మార్కెట్లను అదుపు చేస్తాయి. అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులో లేకుండా చేస్తాయి. నవకల్పనలు, కొత్త సంస్థలను ఎదగనివ్వకుండా చూస్తాయి. తమ లాభాల కోసం ప్రభుత్వ సేవలను ప్రయివేటీకరించేట్లు చూస్తాయి. తమ లాభాలకు ముప్పురాకుండా ధరలను కూడా పెంచుతాయి. వీటికి ప్రభుత్వాలు ఎల్లవేళలా మద్దతు ఇస్తాయి. అందుకే కొన్ని కార్పొ రేట్లు దేశాల జిడిపి కంటే ఎక్కువ సంపదలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు యాపిల్ కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల డాలర్ల నుకుంటే 2023లో మన దేశ జిడిపి 3.7లక్షల కోట్లని అంచనా. ప్రపంచంలోని ఇలాంటి ఐదు పెద్ద కంపెనీల సంపదలు మొత్తం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మొత్తం బహుళజాతి కంపెనీల లాభాల్లో 1975లో పెద్ద కంపెనీల వాటా నాలుగుశాతం కాగా 2019నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది.
ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే.2009 నుంచి ఈ రంగంలో ఉన్న కొన్ని కంపెనీలు ప్రస్తుతం 5.8లక్షల కోట్ల డాలర్ల ప్రయివేటు పెట్టు బడిదారుల ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇవిగాక బ్లాక్ రాక్, స్టేట్ స్ట్రీట్, వాన్గార్డ్ అనే ఫండ్స్ సంస్థలు 20లక్షల కోట్ల డాలర్ల మేర ద్రవ్య ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ విధానాలను, దేశాధినేతలను శాసించటంలో ఆశ్చర్యం ఏముంది. గుత్త సంస్థలు ప్రపంచానికి కొత్త కాదు. ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ ప్రారంభమైన 1,600 సంవత్సరం నుంచి ఎన్నిదేశాలను ఆక్రమించుకొని దోచుకున్నదీ ఎరిగిందే. వర్తమానంలో రాక్ఫెల్లర్ కంపెనీ ప్రపంచ చమురు సామ్రాజ్యం, సిసిల్ రోడెస్ ప్రపంచ వజ్రాల మార్కెట్ను శాసిస్తున్న సంగతీ తెలిసిందే. ఒక దశను దాటిన తరువాత ప్రజాస్వామిక రాజ్యం కంటే ప్రయివేటు అధికారం పెరిగితే స్వేచ్చకు హామీ ఉండదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చెప్పాడు. గుత్త సంస్థలను అడ్డుకున్నందుకే అవి కుట్రచేసి మిలిటరీ తిరుగుబాటు ద్వారా చిలీ కమ్యూనిస్టు నేత సాల్వెడార్ అలెండీని అధి కారం నుంచి కూల్చివేసిన సంగతి తెలిసిందే. పదహారు వందల బడా కంపెనీల మీద ఒక సర్వే నిర్వహించగా కేవలం 0.4శాతం మా త్రమే కార్మికులకు జీవన వ్యయ వేతనం ఇస్తు న్నట్లు అంగీకరించాయి.కార్మిక సంఘాలను ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవటం, అణచి వేతల కారణంగా యూనియన్లలో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది.ఓయిసిడి దేశాలలో 1985లో 30శాతం మంది చేరగా 2017 నాటికి 17శాతానికి పడిపోయింది.
మహిళలకు జరుగుతున్న అన్యాయం, వేతనాల చెల్లింపు కూడా దారుణంగా ఉంది. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో ఒక పురు షుడు ఎలాంటి చెల్లింపులు లేని సంరక్షణ పని లో వారానికి ఒకటి నుంచి ఐదు గంటల వరకు ఉంటుండగా అదే మహిళలు 17 నుంచి 34గంటలు పని చేస్తున్నారు. ప్రపంచమం తటా వీరి పని విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఏటా 10.8 లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. అధికవేతనాలు ఉన్నాయని అను కుంటున్న ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో చెల్లిస్తున్నదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.ఐరోపా సూపర్ మార్కెట్లకు సరఫరా చేసే పండ్లు, ద్రాక్ష క్షేత్రాల్లో పని చేసే కోస్టారికా, దక్షిణాఫ్రికా మహి ళలకు ఒక సీసా వైన్ విక్రయించే ధరలో కేవలం 1.2శాతమే వేతనాల రూపంలో లభిస్తుండగా సూపర్ మార్కెట్లకు 50శాతం పైగా దక్కుతున్నది. సంపదలు కార్పొరేట్ల వద్ద పేరుకు పోవటా నికి, అసమానతలు పెరగటానికి పన్నుల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం. ఓయిసిడి దేశాలలో 1980లో కార్పొరేట్ ఆదా యపన్ను 48శాతం ఉండగా 2022నాటికి 23.1శాతానికి తగ్గిం ది. ప్రపంచవ్యాపితంగా ఇదే ధోరణి.నూటనలభై ఒక్క దేశాలలో 111 చోట్ల 2020-2023 కాలంలో తగ్గాయి. ప్రపంచమంతటినీ చూస్తే 23 నుంచి 17శాతానికి పడిపోయాయి. విదేశాల్లో పొందిన లాభాల్లో 35శాతం ఎలాంటి పన్నులు లేని ప్రాంతాలకు చేరాయి. పన్ను విధానాలపై కార్పొరేట్ల ప్రభావానికి ఇది నిదర్శనం. ఈ మేరకు ప్రభుత్వాలకు రాబడి తగ్గటంతో సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తున్న కారణంగా ప్రపంచమంతటా అశాంతి పెరుగుతున్నది.
ఎం కోటేశ్వరరావు
8331013288