దేశవ్యాప్త సమ్మెలో ఆశా, అంగన్‌వాడీలు

– సమ్మె నోటీసు అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16న జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్‌లో రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీలు, ఆశాలు పాల్గొంటారని తెలంగాణ అంగన్‌వాడీ, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ), తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శనివారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు,వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసును అందజేసినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సునీత, పి జయలక్ష్మి, కోశాదికారి పి మంగ, కార్యదర్శి జి పద్మ, తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జయలక్ష్మి, ఆర్‌ నీలాదేవి, కోశాధికారి పి.గంగమణి పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగ, సంఘాలకు అనుబంధ యూనియన్‌గా ఉన్నామని తెలిపారు. ఐసీడీఎస్‌ బడ్జెట్‌ పెంచాలనీ, ఎన్‌హెచ్‌ఎం స్కీంకు బడ్జెట్‌ పెంచాలనీ, ఆశాలకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఈ జాతీయ సమ్మెతో పాటు గ్రామీణ ఇంద్‌ భాగస్వాములమౌతున్నామని పేర్కొన్నారు.