ప్రమాణ స్వీకారం కోసం ఎమ్మెల్సీల ఎదురు చూపు

MLCs look forward to swearing-in– సమాచారం లేకుండానే వచ్చారు : మండలి చైర్మెన్‌ గుత్తా
– ఆరోగ్యం బాగా లేకపోవడంతో మండలికి రాలేక పోయానంటూ వివరణ
–  సోషల్‌ మీడియాలో ఈ అంశమే హాట్‌ హాట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కోదండ రామ్‌, అమీర్‌ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమ అనేది చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఆ ఇద్దరు మండలిలో రెండు గంటలకు పైగా ఎదురు చూసినా చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాకపోవడం వివాదంగా మారింది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీ విపరీతంగా ట్రోల్‌ చేసింది. సీఎం కేసీర్‌ ఒత్తిడితోనే మండలి చైర్మెన్‌ రాలేదని విమర్శలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను గుత్తా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. కోదండ రామ్‌, అలీఖాన్‌ ఇద్దరూ తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా మండలికి వచ్చారని తెలిపారు. తాను ఈ నెల 25 నుంచి గొంతు నొప్పితో బాదపడుతున్నానని తెలిపారు. గవర్నర్‌ ఎట్‌హౌం కార్యక్రమంతో పాటు 27,28, 29 తేదీల్లో ముంబాయిలో జరిగిన అల్‌ ఇండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ కాన్ఫరెన్స్‌కు కూడా వెళ్ళలేదని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సంద్భంగా మండలిలో మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం ఇవ్వాలని అడగగా, ఈ నెల 31న సాయంత్రం 3.30 గంటలకు సమయం ఇచ్చానని తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అదే రోజు వస్తే అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తానని తెలిపారు. శాసన మండలి చైర్మెన్‌గా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నాననీ, మీడియా ప్రతినిధులు తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.