మూడు కోట్లకు చేరువలో కోవిడ్‌ మరణాలు!

మూడు కోట్లకు చేరువలో కోవిడ్‌ మరణాలు!న్యూయార్క్‌ : కోవిడ్‌-19 కారణంగా మరణించిన వారి మరణాలపైన లండన్‌ నుంచి వెలువడే ఎకనామిస్ట్‌ మ్యాగజైన్‌ తాజా గణాంకాలను ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ వల్ల చనిపోయిన వారి సంఖ్య 28.5మిలియన్లు అని ఎకనామిస్టు రాసింది. ఈ సంఖ్య 2023లో అధికారికంగా ప్రకటించిన 7మిలియన్ల కంటే 4.1రెట్లు ఎక్కువ. అమెరికాలో కోవిడ్‌ అక్టోబర్‌ మధ్యలో వేగవంతమై నూతన సంవత్సరం నాటికి శిఖరాగ్ర స్థాయికి చేరింది. గత మే నెలలో కోవిడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జన్సీ (పిహెచ్‌ఇ) ని బైడెన్‌ రద్దు చేయాలని నిర్ణయించిన తరువాత కోవిడ్‌ వల్ల సంభవించిన మరణాలను అధికారికంగా తక్కువచేసి చూపటం జరుగుతోంది. ఈ వారారంభంలో రోజుకు 10లక్షల కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు ఉండగా అమెరికాలో కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతున్నట్టుగా చూపిస్తున్నారు. తాజా కోవిడ్‌ వెల్లువలో గత మూడు నెలల కాలంలో 10కోట్ల అమెరికన్లకు కోవిడ్‌ సోకింది. ఇది అమెరికా మొత్తం జనాభాలో మూడవ వంతు. ఇలా కోవిడ్‌ సోకినవారిలో చాలామందికి గతంలో కోవిడ్‌ సోకిన చరిత్ర ఉంది. దీనితో వీరికి సుధీర్ఘ కాలం కోవిడ్‌ సోకే అవకాశం ఉంటుంది. అంతేకాదు కోవిడ్‌ పర్యవసానంగా వచ్చే గుండె జబ్బుల, ఇతర కోవిడ్‌ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ అంచనాలను మిగిలిన ప్రపంచానికి వర్తింపజేసినప్పుడు నేడు ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న జెఎన్‌-1 రకం కోవిడ్‌ వల్ల 100 నుంచి 200కోట్ల మందికి కోవిడ్‌ సోకి ఉంటుంది. అంటే రానున్న రోజుల్లో అనేక లక్షల మందికి దీర్ఘ కాలం కొనసాగే కోవిడ్‌ సోకే వీలుంటుంది. ఇలా కోవిడ్‌ మరలా మరలా సోకటంవల్ల గుండె జబ్బులు, మెటబాలిక్‌, న్యూరలాజికల్‌ సమస్యలు తలెత్తుతు న్నాయనే ఆందోళన సర్వత్రావుంది. డెసెంబర్‌ నెలలో 10వేలమంది చనిపోయారని 2024లో పెట్టిన మొదటి పత్రికా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా పట్టించుకోవటంగానీ, ఈ ప్రమాదం పర్యవసానాలను గురించి హెచ్చరిం చటంగానీ చేయలేదు. కోవిడ్‌ మరణాల సంఖ్య వాస్తవ మరణాలను ప్రతిబింబించటం లేదని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.