తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తున్న దొంగలు

– బంగారం, వెండి, నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు
– దొంగిలిస్తున్న దొంగలు
నవతెలంగాణ-మిరుదొడ్డి
తాళం వేసిన ఇండ్లను టార్గెట్‌ చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం, వెండి, నగదుతో ఉడాయించి పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. వారం రోజుల వ్యవధిలో దుబ్బాక సర్కిల్‌ పరిధిలోని రెండు గ్రామాల్లో దొంగతనం జరిగింది. నిఘా నేత్రాలు లేకపోవడంతో గ్రామాల్లో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. ఉపాధి కోసం వచ్చినట్లు నటిస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ గ్రామాల్లో చిల్లర దొంగతనాలుకు పాల్పడుతున్నారు. రెండుమూడు నెలల నుంచి సంతలతో పాటు గుమ్మిగుడిన ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. మండలంలోని అల్వాల గ్రామంలో ఒకేరోజు ఆరు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. నాలుగు రోజులు గడవకముందే దుబ్బాక మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో అర్ధరాత్రి తాళం వేసిన ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని నగదు, వెండి, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఆ గ్రామానికి చెందిన మర్కంటి యాదమ్మ ఇంట్లో 50 తులాల వెండి వస్తువులతో పాటు మూడున్నర తులాల బంగారం, రూ.9 వేల నగదు, అదే గ్రామానికి చెందిన సాయి కష్ణ ఇంట్లో తులం బంగారంతో పాటు రూ.14,500 ఎత్తుకెళ్లినట్టు బాధితులు వాపోతున్నారు. తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను త్వరలో పట్టుకుని కోర్టుకు రిమాండ్‌ చేస్తామని సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఎవరైనా గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.