పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధం

పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధం– రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం
– మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం : సోనియా గాంధీకి తెలిపిన రేవంత్‌ రెడ్డి
– తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ(పీఏసీ) తీర్మానం చేసి పంపిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరారు. స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. జార్ఖండ్‌ పర్యటనకు వెళ్లన సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఢిల్లీలోని జన్‌ పథ్‌ 10లో సోనియా గాంధీని ఆమె నివాసంలో సీఎం కలిశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, ప్రసార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను సోనియా దృష్టికి తీసుకెళ్ళారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచడాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్‌ తాజా భేటిలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ. 500కే గృహ అవసరాలకు గ్యాస్‌ సిలిండర్‌ అమలు చేయనున్నామని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామనీ, అందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్నిరకాలుగా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని సీఎం వివరించారు. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం… జార్ఖండ్‌ పర్యటన ముగించుకొని ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సోమవారం రాత్రి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఢిల్లీలో బస చేశారు. ఈ రోజు పలువురు పార్టీ ముఖ్య నేతల్ని కలిసి తిరిగి హైదరాబాద్‌ బయలు దేరే అవకాశం ఉంది.
భారత్‌ న్యాయ్ యాత్రలో సీఎం…
కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ న్యారు యాత్రలో సోమవారం సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో కొనసాగుతున్న యాత్రలో రాహుల్‌ గాంధీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు గ్యారంటీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వివరాలను తెలియజేశారు. అలాగే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్దమవుతున్న తీరును రాహుల్‌ గాంధీకి రేవంత్‌ రెడ్డి వివరించారు. న్యారు యాత్రలో సీఎం వెంట రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించండి : నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ సుమన్‌ భేరీకి సీఎం వినతి
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన గ్రాంటు రూ.1,800 కోట్లు వెంటనే రిలీజ్‌ అయ్యేందుకు సహకరించాలని నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ సుమన్‌ భేరీకి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం కలిశారు. హైదరాబాద్‌లో మూసీ నది రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. ఇందుకు అవసరమైన వరల్డ్‌ బ్యాంక్‌ ఎయిడ్‌ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగు నీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు రాష్ట్రంలో తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు సహకారం అందించాలని కోరారు.