– నిధులను పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చుపెట్టాలిొ ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలి :
– హరితనిధిపై సమీక్షలో అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరిత నిధికి జమయ్యే ప్రతి రూపాయికీ లెక్కా పక్కాగుండాలనీ, ఆ డబ్బులను పారద్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చుపెట్టాలని అధికారులకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో హరితనిధి విరాళాలు, వ్యయంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఇప్పటి దాకా ఈ పథకంలో వచ్చిన విరాళాలు, ఖర్చు వివరాలను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2021 లో మొదలైన హరితనిధి ద్వారా ఇప్పటి దాకా 69.21 కోట్ల రూపాయలు జమయ్యాయని వెల్లడించారు. అందులో రూ.43 కోట్ల మేరకు పనులు మంజూరయ్యాయనీ, రూ.29. 39 కోట్లు విడుదల కాగా, 18.72 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాకు ఒకటి చొప్పున సెంట్రల్ నర్సరీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం పెద్ద మొక్కల పెంపకం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మిగిలిన పనులు, దశాబ్ది సంపద వనాల పేరుతో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూముల్లో వనాల పెంపకం వంటి పనులు హరితనిధి ద్వారా వచ్చిన నిధులతో జరుగుతున్నదని వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..హరితనిధి కేటాయింపులు, ఖర్చుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటైన నర్సరీలు, జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్కు సూచించారు. పూర్తయిన పనుల ఆడిట్ నివేదికలను కూడా పరిశీలించాలని తెలిపారు. మంజూరై, పనులు మొదలు పెట్టని జిల్లాలను నుంచి నిధులను వెంటనే వెనక్కి తీసుకుని, తాజా పనులకు కేటాయించాలని అన్నారు. తెలంగాణ నేల స్వభావానికి అనువైన చింత, వేప, రేల లాంటి చెట్లను రహదారుల వెంట నాటేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్ (హరితహారం) సువర్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.