కృష్ణా జలాల వివాదం కేసు మార్చి 13కు వాయిదా

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కృష్ణా ట్రిబ్యునల్‌-2 టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌) కృష్ణా ట్రిబ్యునల్‌ -2 కు సంబంధించిన టీఓఆర్‌పై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్భంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోసారి ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కెవి విశ్వనాధన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదనలు వినిపిస్తూ… కేసుకు సంబంధించి ప్లీడింగ్స్‌ పూర్తయ్యాయని, వాదనలకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు అంగీకారం తెలిపిన ధర్మాసనం విచారణను మార్చి 13కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.