కేసీఆర్‌ హయాంలో తెలంగాణ వ్యతిరేకులకు రెడ్‌ కార్పెట్‌

– మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తన ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ తెలంగాణ వ్యతిరేకులకు రెడ్‌ కార్పెట్‌ పరిచారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. అసెంబ్లీలో కృష్జాజలాలపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన నీళ్ల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రాజెక్టులు ఏటీఎమ్‌లుగా మారాయని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఒక్కరే పోరాడలేదన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగిన సమయంలో తానూ, రాజగోపాల్‌రెడ్డి ముందువరుసలో ఉన్నామన్నారు. అప్పుడు కేసీఆర్‌ ఎక్కడ పోయారని నిలదీశారు. ఇక్కడ ప్రాజెక్టులను వదిలిపెట్టి రాయలసీమలో రత్నాల సీమ చేస్తామని కేసీఆర్‌ ఎలా అన్నారని ప్రశ్నించారు. కృష్ణా నదీజలాల్లో జరిగిన అన్యాయంపై అడుగుతుంటే గోదావరి నీళ్లు అంటున్నారనీ, కృష్ణా అయినా, గోదావరి అయినా మన వాటా మనకు దక్కాల్సిందేనని నొక్కి చెప్పారు.