– 21న పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం
అమరావతి : రాష్ట్రంలో ఎన్డీిఏ కూటమి పొత్తుల అంశం కొలిక్కి రానున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు మరోసారి బిజెపి అధిష్టానం నుండి పిలుపు వచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రేపు (మంగళ వారం) వారిద్దరిని అందుబాటులో ఉండాలని బిజెపి నేతలు కోరారు. అవసరమైతే ఆ రోజు ఢిల్లీకి రావాల్సిఉంటుందని బీజేపీ నాయకత్వం సూచించి నట్లు చెబుతున్నారు. దీంతో ఈ నెల 21న ఎన్డిఎ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశలో ప్రకటన వెలువడి ఉండాల్సిందని, బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఆలస్యమైందని అంటున్నా రు. బీజేపీితో పొత్తు ఖాయమని తేలడంతో సీట్ల సర్దుబాటు గురించి టీడీపీ, జనసేన నేతల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. వైసీపీ నుండి వచ్చే నేతలను చేర్చుకునే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?
విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ 10 ఎమ్మెల్యే, ఆరు ఎంపి సీట్లు అడుగుతోంది. వీటిల్లో రాజమండ్రి, నరసాపురం, రాజంపేట ఎంపి సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యవక్తం చేసినట్లు సమాచారం. మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి, తిరుపతి పార్లమెంటు సీట్లను జనసేన అడుగుతుండగా, మచిలీపట్నం, కాకినాడ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ నుంచి అంగీకారం ఉందని సమాచారం. తప్పని సరైతే అనకాపల్లి కూడా ఇచ్చే వీలుంది. ఎమ్మెల్యే సీట్ల విషయానికి జనసేన 28 నుంచి 33 స్థానాలు కోరుతున్నట్లు తెలిసింది.
సీనియర్లకు బుజ్జగింపులు
పొత్తుల్లో భాగంగా ఎవరి సీటు త్యాగం చేయాల్సి వస్తోందోననే భయం టిడిపి సీనియర్ నేతల్లో కనిపిస్తోంది. సీటింగ్ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని సీనియర్లు పట్టుపడుతున్నారు. ఇదే సందర్బంలో టీడీపీ సిట్టింగ్ స్ధానాలను బీజేపీ, జనసేనకు కేటాయించాల్సి వస్తే సీనియర్ శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగు స్థానాలను త్యాగం చేసేందుకు టీడీపీ సీనియర్లు అంగీకరించడం లేదని తెలిసింది. వారికి నచ్చజెప్పే పనిలో టీడీపీ నాయకత్వం ఉంది.