– సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
– ఈ ఏడాది వెయ్యి మందికి కారుణ్య నియామకాలు
– థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడండి
– సింగరేణిపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు
– నేడు నోటిఫికేషన్లు : సీఎండీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కాలరీస్లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారుల్ని ఆదేశించారు. అలాగే సంస్థలో కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలనీ, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. బుధవారంనాడాయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సింగరేణి కాలరీస్పై ఆ సంస్థ సీఎమ్డీ ఎన్ బలరాం నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలనీ, పరీక్షల్లో ఏలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇటీవల జరిగిన సింగరేణి ఉద్యోగ మేళాలో ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, వారసుల వయో పరిమితిని 35 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండా చేసుకున్న కోటి రూపాయల ప్రమాద బీమా ఒప్పందం పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. సంస్థలో పనిచేస్తున్న 43 వేల మంది ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించినట్లవుతుందని చెప్పారు. కోల్ ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి ఒప్పందం ఏదీ లేదని, త్వరలో మిగిలిన బ్యాంకులతోనూ ఈ తరహా ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎమ్డీ ఎన్ బలరామ్ వివరించారు. సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఈ నెల 26వ తేదీ ప్రారంభించనున్నందున ఏర్పాట్లు చేయాలని డిప్యూటి సీఎం సింగరేణి అధికారులను ఆదేశించారు. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే సింగరేణి ఉద్యోగులు, అధికారుల సౌకర్యార్ధం హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన అతిథి గహం భూమి పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.కార్మికుల సంక్షేమం కోసం సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనీ, గోదావరిఖని, మంచిర్యాల కార్మికులకు సురక్షిత మంచినీరు అందించేందుకు వీలుగా చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లను త్వరలో ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున బొగ్గు ఉత్పత్తి, రవాణాపై రోజువారీ సమీక్ష నిర్వహించాలనీ, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా సీఎమ్డీ ఎన్ బలరాం మాట్లాడుతూ సంస్థలోని 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు.