– గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు
– ఈ నెల 27 లేదా 29న ప్రారంభం
– విధి విధానాలపై సర్కార్ కసరత్తు
– అమలుపై క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలు పట్టాలెక్కనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే వీటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పథకాల అమలు, విధివిధానాలపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి క్యాబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27 లేదా 29న ఈ రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? ఏజెన్సీలకు చెల్లించాలా? అందుకు ఉన్న అడ్డంకులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలనీ, ప్రజలకు అనువైన విధానాన్ని అనుసరించాలని సీఎం చెప్పారు. ఇందుకు గాను గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంట వెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ ఈ పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే, సవరించుకునే అవకాశమివ్వాలని సీఎం సూచించారు. విద్యుత్ బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. అందుకు సంబంధించి ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్ శాఖ ఫ్లెక్సీల ద్వారా తగిన ప్రచారం చేపట్టాలన్నారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల నుంచి ఈ పథకం వర్తింపజేయాలని చెప్పారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతరంగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ డీఎస్ చౌహన్, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రిజ్వీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.