ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకూ ఐఆర్‌

– ఆర్థిక శాఖకు సీఎంవో ఆదేశాలు
– ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకూ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)లోని మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కార్యాలయం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేతన సవరణ కమిషన్‌ ఏర్పాటు సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్‌ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆది నుంచి పీఆర్సీ పరిధిలో ప్రభుత్వరంగ సంస్థలైన కార్పొరేషన్లు, వివిధ సొసైటీల ఉద్యోగులకు సైతం ఐఆర్‌ వర్తింపచేస్తున్నారు. కానీ అక్టోబర్‌ నాటి ఉత్తర్వుల్లో వారిని చేర్చకపోవడం గమనార్హం.
ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జేఏసీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమకు పీఆర్సీని వర్తింపచేయాలనీ, ఐఆర్‌ ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన సీఎం వెంటనే ఆర్థిక శాఖకు నోట్‌ పంపించాలని తన కార్యాలయ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రత్యేక కార్యదర్శి సైతం దీనిపై ఆర్థిక శాఖకు లేఖ పంపించారు. అధికారులు దీనిపై ప్రతిపాదనలను రూపొందించి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.