అంగన్వాడీ హెల్పర్స్‌కి పాత పద్ధతిలోనే ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలి

– అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.పద్మ
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్‌ డిమాండ్‌
– కలెక్టరేట్‌ ఎదురుగా అంగన్వాడీ హెల్పర్స్‌ మహాధర్నా
– జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అలాకు వినతి
నవతెలంగాణ-పాల్వంచ
అంగన్వాడీ హెల్పర్స్‌కి పాత పద్ధతిలోనే ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.పద్మ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదురుగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటియు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. భారీ నినాదాలతో హెల్పర్స్‌ హౌరెత్తించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఈసం వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ మధ్యకాలంలో ఐసిడిఎస్‌ 9వేల అంగన్వాడీ ఉద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే వెంటనే భర్తీ చేస్తామని ప్రకటించిందని సంతోషం, కానీ ఇదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకి ప్రమోషన్‌ సౌకర్యం, విద్యార్హత ఎస్‌ఎస్‌సీ ఉన్న దానిని ఇంటర్‌ కి మార్చారు. దీనివల్ల అనేక సంవత్సరాల తరువాత వస్తున్న ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వచ్చే ప్రమోషన్‌ సౌకర్యానికి ఎక్కువమంది అంగన్వాడీ హెల్పర్స్‌ ప్రభుత్వం చేసిన నిర్ణయంతో హెల్పార్స్‌ తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరణ చెయ్యాలని,పాత పద్దతిలోనే ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలని,ప్రమోషన్‌ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సుమారు 70వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సగం మంది గత 45 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నారు. వీరికి గతంలో ఎస్‌ఎస్సి అర్హత ప్రకారం టీచర్గా ప్రమోషన్స్‌ సౌకర్యం ఉండేది. గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో విద్యార్హతను ఇంటర్‌ గా మార్చింది. అంగన్వాడీ టీచర్‌ పోస్ట్‌ భర్తీ చేయాలంటే ఇంటర్‌ ఉండాల్సిందేనని ప్రభుత్వం అంటుంది. ఐసిడిఎస్‌ పట్ల ఎలాంటి అవగాహన లేని ప్రజల నుండి కొత్తగా వచ్చే వారికి సంవత్సరాలకు పైగా ఐసిడిఎస్‌ లో అంగన్వాడీ కేంద్రాలను అంటిపెట్టుకొని పనిచేస్తూ టీచర్లు ప్రభుత్వం చెప్పిన అదనపు పనులు చేయడానికి బయటకు వెళ్లినప్పుడు ఆయా సమయాల్లో టీచర్ల పనులు కూడా హెల్పర్లు నిర్వహిస్తూ ఐసిడిఎస్‌ పైన అపార అనుభవం ఉన్న హెల్పర్లకు పాత కొత్త ఇద్దరికీ ఏ తేడా లేకుండా ఒకే రకమైన విద్యార్హత ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం అత్యంత అన్యాయం అన్నారు. కొత్త, పాత తేడా లేనప్పుడు ఇది ప్రమోషన్స్‌ సౌకర్యం ఎలా అవుతుందో ప్రభుత్వం పరిశీలించాలన్నారు. హెల్పర్స్‌లో కూడా ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉన్న వాళ్ళు ఉన్నారని వారికి కూడా ప్రమోషన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరించాలని రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని వంట పాత్రలు ఇవ్వాలని స్టేషనరీ ఇవ్వాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ సౌకర్యం ఐదు లక్షలు ఇవ్వాలని వస్తున్న జీవితంలో ప్రతినెల సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిచో రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కే సత్య, డి వీరన్న, అంగన్వాడీ హెల్పర్స్‌ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వీరభద్రమ్మ, జిల్లా కమిటీ సభ్యులు రాంబాయి, విజయ, కళ్యాణి, భవాని, లక్ష్మి, అనురాధ, వెంకటమ్మ, పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.