విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విద్యాధర్ కాగిత మీడియాతో ముచ్చటించారు.’నిజంగా జరిగిన ఓ సంఘటన నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. ఆ ఐడియాని రాసిపెట్టుకున్నాను. దీంతో పాటు హిమాలయాల పర్వాతాలు, మంచు, అక్కడ ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే విఠలాచార్య లాంటి సాహస కథలు ఇష్టం. ఇవన్నీ కలసి ఒక ఆలోచనగా మారాయి. మనకి దొరికిన బడ్జెట్లో తీసేద్దామనే ఆలోచనతో మొదలుపెట్టాం. క్రౌడ్ ఫండ్ కోసం ఒక పిచ్ వీడియో చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బులతో సినిమాని స్టార్ట్ చేశాం. తర్వాత డబ్బులు అవసరమైతే నిర్మాత బయట నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఒక గ్లింప్స్ చూసి యూవీ క్రియేషన్స్ వారు రావడం జరిగింది. నటుల కోసం చూస్తున్నపుడు విశ్వక్ని అనుకున్నాం. చాలా ఓపెన్ మైండ్తో తను ఈ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకున్నారు. నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆడియన్స్కి కొత్త అనుభూతిని ఇవ్వడానికి విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా కొత్తగా ప్రయత్నించామని భావిస్తున్నాం. ట్రైలర్లో చాలా పాత్రలు కనిపించాయి. ఇది హైపర్ లింక్ స్టొరీనే. అయితే దాని గురించి ఇప్పుడే చెప్పడం సబబు కాదు. అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే ఆ పాత్రలన్నీ చాలా ఆసక్తికరంగా సాగుతాయి. ఈ సినిమా అంతా ఎంగేజింగ్గా ఉండబోతుంది. తర్వాత ఏం జరగబోతుందనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా, డ్రామా చాలా అద్భుతంగా వుంటుంది. అది ప్రేక్షకులని సినిమాలో లీనం చేస్తుంది’.