ఎన్‌హెచ్‌ఎం స్కీం ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలి

– సీఎం రేవంత్‌రెడ్డికి కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) స్కీంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మూడు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బుధవారం లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ స్కీంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి జిల్లా స్థాయి, పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్‌ స్థాయి దాకా గ్రామాల్లో ప్రజల మధ్య ఉండి వారి ఆరోగ్యం కోసం నిత్యం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సేవలను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన అందాల్సిన జీతాలు గత మూడు నెలలుగా వారికి అందకపోవటంతో పేద, మధ్యతరగతి ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.