– బండి సుధాకర్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఐదారు నెలల తర్వాత కాంగ్రెస్ సర్కారు ఉండదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలు చేస్తున్న కేసీఆర్పై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో సీనియర్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్న సంగతి తెలుసుకుని వారు పార్టీ నుంచి వెళ్లిపోతారనే భయంతోనే, నిస్సహాయ పరిస్థితుల్లోనే కేసీఆర్ పైపైకి బీరాలు పలుకుతున్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు మాత్రమే ఫైనల్ అనే విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ మరిచిపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.ప్రజాస్వామ్యబద్దంగా పూర్తి మెజార్టీతో ఏర్పాటై, ప్రజారంజకంగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎలా పడగొడతారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు ఉన్న సంఖ్యాబలం, ప్రజాబలం చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని గుర్తు చేశారు. అయితే, కేసీఆర్ ఇంకా తానే సీఎం అనే భ్రమల్లో ఉన్నారని, తమ కుటుంబం అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేసీఆర్ ఓ సినిమా తీసి, అందులోనైతే తానే సీఎం పాత్రలో నటించవచ్చు కదా? అని ఎద్దేవా చేశారు.