– కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు
– రూ.2700 కోట్ల ఖర్చుతో ఏర్పాటు
– టాటా టెక్నాలజీస్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ
– ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభానికి సన్నాహాలు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాటా కంపెనీ ప్రతినిధుల భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. అనంతరం సీఎం మాట్లాడుతూ వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో రూ.2,700 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. వర్కషాప్ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రి, శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా సంస్థ చేపడుతుందని చెప్పారు. ఐటీఐలలో కొత్తగా 9లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాది 9,000 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటు దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తామని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని సీఎం టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణ నివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్ ప్లేస్ మెంట్లపై దష్టి పెట్టాలని కోరారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ హైదరాబాద్ను స్కిల్ డెవెలప్మెంట్ హబ్గా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయన్నుట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ అధ్యక్షులు పవన్ బగేరియా తదితరులు పాల్గొన్నారు.