– ఆర్ఎస్ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి అనుమతి ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ప్రవీణ్ కుమార్ ఆదివారం సామాజిక మాద్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇరు పార్టీలు కలిసి పోటీచేస్తాయని ప్రకటించారు. బీఎస్పీ-బీఆర్ఎస్ పార్టీల కూటమి చర్చలపై రాష్ట్రంలో ఏర్పడిన సందిగ్దానికి మాయావతి తెరదించారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఎన్డీయే, ఇండియా కూటమిలో లేనందున ఆ పార్టీతో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయటానికి పార్టీ అదిష్టానం అనుమతించిందని తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్టు వివరించారు.