ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దోపిడీ

– లారీల కొరత లేకుండా చూడాలి అ త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి :జెడ్పీటీసీ
నవతెలంగాణ-పెద్దఅడిశర్లపల్లి
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర అందించే లక్ష్యంతో పీఎసీఎస్‌,ఐకెపి కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు దోపిడికి గురవుతున్నారని స్థానిక జెడ్పీటీసీ, జిల్లా కాంగ్రెస్‌ జెడ్పీ ఫోర్‌ లీడర్‌ అలుగుబెల్లి శోభారాణి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలోని ఘనపురం వరి కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్‌ మిల్లు యజమానులు తాలు పేరుతో కొర్రీలు పెడుతూ క్వింటాకు 5 కేజీల వరకు తరుగు ఇస్తేనే ధాన్యం దిగుబతి చేసుకుంటామని లారీలను నిలిపివేయడంతో లారీ యజమానులు అదనపు కిరాయి కింద రూ.2 వేల వరకు రైతుల వద్ద వసూలు చేయడం, హమాలీలకు, సిబ్బందికి డబ్బులు ముట్ట చెప్పడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డిఎస్‌ఒకు ఫోన్‌ చేసి రైతుల కష్టాలను అర్థం చేసుకొని అవకతవకలు జరగకుండా చూడాలని, మిగిలిన వరి ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా మిల్లుల వద్ద త్వరితగతిన దిగుమతి అయ్యేల చూసి,లారీల కొరత లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్ధన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్య యాదవ్‌, కార్యనిర్వాకాహాధ్యక్షులు నెరమటి సతీష్‌రెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, పాండు నాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.