సాంకేతిక విజ్ఞానంతో సమానంగా అవగాహన కల్పించాలి

– అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : సాంకేతిక విజ్ఞానం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని  పురస్కరించుకొని శుక్రవారం జిల్లా  కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కృత్రిమ మేధస్సు- జాగ్రత్తలు సమస్యలు  అనే అంశంపై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందిందని, మనిషిలాగే రోబోలు ఇతర ప్రత్యామ్నాయ పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో ఇది మానవాళికి ఉపయోగకరంగాను, మరో రకంగా ఇబ్బందికరంగా మారనున్నదని దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు వస్తు, సేవల వినియోగంలో మోసపోకుండా ముందుగానే అవగాహన  కల్పించాల్సిన బాధ్యత వినియోగదారుల సంఘాలు, ప్రభుత్వ సంస్థలు తదితరులపై ఉందని అన్నారు. ఇందుకుగాను వినియోగదారుల సంఘాలు తరచూ అవగాహన సమావేశాలను నిర్వహిస్తూ వినియోగదాలను చైతన్యం చేయాలని కోరారు.కాగా ఫుడ్ ఇన్స్పెక్టర్, లీగల్ మెట్రాలజీ, ఎల్పిజి ద్వారా స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఫుడ్ కమిటీ సభ్యులు సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, జిల్లా వినియోగదారుల సంఘం సభ్యులు గురువయ్య, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ కోపరేటివ్ ప్రెసిడెంట్ హిమగిరి, తదితరులు పాల్గొన్నారు.