నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాజా టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల శాఖకు రూ.1,110.51 కోట్లు అదనంగా సమకూరనుంది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకారం మెట్రిక్ టన్ను ధాన్యం ధర రూ.20,600. గతంలో టెండర్లు పిలిచి మెట్రిక్ టన్నుకు రూ.17,015.19కు టెండర్లు ఖరారు చేశారు. ఆ లెక్కన 34.59 లక్షల మెట్రిక్ టన్నులకు పౌరసరఫరాల శాఖకు రూ.5,885.55 కోట్లు రావాల్సి ఉంది. ఎమ్మెస్పీ ప్రకారం చూస్తే రూ.1,239.99 కోట్లు శాఖ నష్టపోయే పరిస్థితి. అంత తక్కువకే టెండర్లు దక్కించుకున్న కొనుగోలుదారులు ఆ మొత్తం చెల్లించేందుకూ ముందుకు రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచారు. తాజా టెండర్లలో మెట్రిక్ టన్నుకు రూ.20,225.67కు టెండర్ దాఖలైంది. పాత టెండర్తో పోలిస్తే ఇది ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3,210.48 అదనం. ఈ లెక్కన మొత్తం 34.59 లక్షల మెట్రిక్ టన్నులకు తాజా టెండర్ ప్రకారం రూ.6,996.06 కోట్లు రాబడి సమకూరనుంది. పాత టెండర్ల రాబడితో పోలిస్తే ఇది రూ.1,110.51 కోట్లు అదనం.