ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి

 – కోడ్ అమల్లోకి వచ్చినందున బ్యానర్లు, హోల్డింగ్ లను  తక్షణమే తొలగించాలి
 – సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి 
 – ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు  పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో పార్లమెంటు ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుండే పార్లమెంటు  ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు,  వివిధ రకాల ప్రచార సామాగ్రిలు తొలగించాలని, 24, 48 ,72 గంటలలో తొలగించాల్సిన వాటిని సకాలంలో తొలగించాలని, ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీని తక్షణమే పని ప్రారంభించేలా చూడాలని, నివేదికలను ఎప్పటికప్పుడు  పంపించాలని, ఎన్నికలకు సంబంధించి తప్పనిసరిగా రూపొందించే సామాగ్రి,  ఇతర సామాగ్రి పై దృష్టి సారించాలని, నామినేషన్ల స్వీకరణకు  అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకునే విధంగా ముందు నుండి చర్యలు చేపట్టాలని సూచించారు. ఏ ఒకరి నుండి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని, ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని,  సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తక్షణమే స్పందించాలని, కంట్రోల్ రూమ్ ల ఏర్పాటుతోపాటు, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి  టీములు తక్షణం  పని ప్రారంభించాలని ఆదేశించారు.
      ఎన్నికల షెడ్యూల్ తో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను మీడియా తో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని, సువిధ ద్వారా ఇచ్చే అన్ని అనుమతులకు తగు ఏర్పాట్లు చేయాలని, ప్రజాప్రతినిధ్య చట్టం కింద 129 సెక్షన్ పై అందరికీ అవగాహన కల్పించాలని, శాంతి భద్రతలు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బందోబస్తు ప్రణాళిక, ఎన్నికల వెబ్ పోర్టల్  అప్డేట్ చేయడం, నగదు, మద్యం సీజ్ చేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి  తు.చ తప్పకుండా అమలు చేయడం, ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. అడిషనల్ సీఈవో లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ లు  పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి  పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన, ఎస్పీ చందనా దీప్తి,  రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఏఆర్ఓ లు పాల్గొన్నారు.