– కాంగ్రెస్ మ్యానిఫెస్టో రెడీ
– ఆమోదించిన సీడబ్ల్యూసీ… త్వరలో విడుదల
– మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ అమలు
– దేశం మార్పును కోరుకుంటోంది : మల్లికార్జున్ ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీి) ఆమోదం తెలిపింది. మంగళవారం నాడిక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మూడు గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మ్యానిఫెస్టోలోని ముఖ్య అంశాలను పీ.చిదంబరం చదివి వినిపించారు. చిదంబరం నేతృత్వంలో మ్యానిఫెస్టో కమిటీ తయారు చేసిన ముసాయిదాను ఆమోదం కోసం సీడబ్ల్యూసీకి అందించింది. ఆయా అంశాలపై చర్చనంతరం మొత్తం 25 గ్యారంటీల అమలుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ‘పాంచ్ న్యారు’ పేరుతో ఐదు అంశాలతో 25 గ్యారంటీల మ్యానిఫెస్టోను ఖరారు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎ.రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుఖ్, నేతలు కేసీి వేణుగోపాల్, మీరా కుమారి, అంబికా సోనీ, ప్రియాంక గాంధీ, పి. చిదంబరం, దిగ్విజరు సింగ్, వీరప్ప మొయిలీ, అజరు మాకెన్, కుమారి సెల్జా, హరీష్రావత్, సుబ్బిరామి రెడ్డి, మనీష్ తివారీ, సచిన్ పైలట్, పవన్ కుమార్ బన్సాలీ, రాజీవ్ శుక్లా, జైరాం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ దేశం మార్పును కోరుకుంటోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన ‘హామీలు’ 2004 నాటి ‘ఇండియా షైనింగ్’ నినాదంతో సమానమని ఎద్దేవా చేశారు. పార్టీ మ్యానిఫెస్టోలో లేవనెత్తిన ప్రతి అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ సూచించారు. ”మ్యానిఫెస్టోకు వివిధ రాష్ట్రాల్లో విస్తత ప్రచారం లభించేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ఉంది” అని ఆయన అన్నారు. ”2004 లోక్సభ ఎన్నికల సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఇండియా షైనింగ్’ నినాదాన్ని ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ప్రతి ఇంటికి పార్టీ మ్యానిఫెస్టోను తీసుకెళ్లేందుకు గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా పనిచేయాలి” అని ఖర్గే అన్నారు. మ్యానిఫెస్టోలో ఏ హామీ ఇచ్చామో వాటిని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో వాగ్దానాలు చేసే ముందు, ఈ వాగ్దానాలు అమలుకు నోచుకునేలా లోతుగా చర్చించినట్లు తెలిపారు. ”1926 నుండి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ‘విశ్వాసం, నిబద్ధతకు సంబంధించిన పత్రం’గా పరిగణించబడుతుంది” అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యారు యాత్రను ఖర్గే కొనియాడారు. దీనిద్వారా కాంగ్రెస్ ప్రజల నిజమైన సమస్యపై దేశం దృష్టిని ఆకర్షించగలిగిందని అన్నారు. ”ఇవి కేవలం రాజకీయ యాత్రలు మాత్రమే కాదు. మన రాజకీయ చరిత్రలో అతిపెద్ద సామూహిక సంప్రదింపు ఉద్యమంగా గుర్తించబడతాయి. మన కాలంలో ఎవరూ ఇంత భారీ కసరత్తు చేపట్టలేదనే వాస్తవాన్ని ఎవరూ అణగదొక్కలేరు. ఈ రెండు యాత్రలు ప్రజల సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగాయి” అని ఆయన భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర గురించి ప్రస్తావించారు.
సీడబ్ల్యూసీ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు కేసీ. వేణుగోపాల్, జైరాం రమేష్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మ్యానిఫెస్టోకు తుది ఆమోదం తెలిపేందుకు, విడుదల తేదీని నిర్ణయించేందుకు ఖర్గేకు సీడబ్ల్యూసీ అధికారమిచ్చిందని అన్నారు. ”పార్టీ హామీలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేందుకు సీడబ్ల్యూసీ రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. ప్రజలు ఉజ్వల భవిష్యత్తును చూసేందుకు కాంగ్రెస్ కేవలం ‘ఘోషణ పత్ర’ (మ్యానిఫెస్టో) మాత్రమే కాకుండా ‘న్యారు పత్ర’ విడుదల చేస్తుంది” అని అన్నారు.
ఇప్పటికే రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘హిస్సేదారి న్యారు’, ‘కిసాన్ న్యారు’, ‘నారీ న్యారు’, ‘శ్రామిక్ న్యారు’, ‘యువ న్యారు’ పేరిట హామీలను ప్రకటించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రయివేట్ రంగంలో 25 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హౌల్డర్లకు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏండ్లలోపు యువత స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ. లక్ష సాయం వంటి 25 గ్యారంటీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.
మ్యానిఫెస్టోలోని 25 గ్యారంటీలు
హిస్సేదారి న్యాయ్ :
సామాజిక, ఆర్థిక కుల గణన
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50శాతం సీలింగ్ తొలగింపు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం ప్రత్యేక బడ్జెట్
జల్ జంగల్ జమీన్ పై చట్టబద్ధ హక్కులు
గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు
కిసాన్ న్యాయ్ :
స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత
రుణమాఫీ కమిషన్ ఏర్పాటు
పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ
రైతులు లబ్ది పొందేలా ఎగుమతి, దిగుమతి విధానం
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు
శ్రామిక్ న్యాయ్ :
వైద్య హక్యు చట్టం
రోజుకు రూ.400 కనీస వేతనం. ఉపాధి హామీ చట్టంలో సైతం
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు
అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా
ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల
యువ న్యాయ్:
కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ – ఏడాదికి రూ. లక్ష, నెలకు రూ. 8500 చెల్లింపు
పేపర్ లీక్ అరికట్టేందుకు కఠిన చట్టం
గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు
యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు
నారీ న్యాయ్ :
ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ. లక్ష
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వర్కర్స్ డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్
మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు
వర్కింగ్ ఉమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్.