ధరణి దేశంలోనే పెద్ద కుంభకోణం

–  బీఆర్‌ఎస్‌ నేతలకు కోట్ల ఆదాయం : కోదండరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ దేశంలోనే పెద్ద కుంభకోణమని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ నేత కోదండరెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్టు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ధరణి పోర్టల్‌ చిక్కులతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణిని అడ్డుపెట్టుకుని చేస్తున్న అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ధరణి పోర్టల్‌తో 52 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 15 లక్షల ఎకరాల రైతులకు సంబంధించిన భూములు ఆన్‌లైన్‌లో ఎక్కలేదన్నారు. ధరణి పోర్టల్‌లోని లోపాలను మంత్రి హరీష్‌రావు ఎందుకు సరిదిద్దలేదని ప్రశ్నించారు.