– మూడంచెలుగా సమన్వయ కమిటీలు
– బూత్ కమిటీలో ఐదుగురు కీలక సభ్యులు
– లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలనీ, కార్యకర్తల వెన్నంటి ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. గతంలో తమకు విజయం తెచ్చిపెట్టిన మల్కాజిగిరి ఎన్నికల మోడల్ను రాష్ట్రమంతటా అనుసరించా లని ఇప్పటికే పార్టీ ముఖ్యులకు రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా ఒకట్రెండు రోజుల్లోనే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ , అసెంబ్లీ, బూత్ స్థాయిల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గ స్థాయి కమిటీలో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ, ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలుంటారు.
బూత్ స్థాయి కమిటీల్లో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు ఐదుగురికి అవకాశం కల్పిస్తారు. బూత్ కమిటీలో ఉండే ఐదుగురే ఈ సారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎన్నికలకు వీరే సైనికులుగా నిలబడతారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థికి ఆ బూత్లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్ కమిటీ సభ్యుల పని తీరుకు ప్రాతిపదికగా ఉంటుందని అన్నారు.
బూత్ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో ఈ సందర్భంగా చెప్పారు. పనితీరును బట్టి త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అర్హులైన లబ్దిదారుల ఎంపికను పర్యవేక్షించే బాధ్యతలను నిర్వహించేందుకు ఆయా కమిటీలను ఏర్పాటు చేస్తామంటూ సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.