– మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మానవాళిని తమ పాపాల నుంచి రక్షించేందుకు శిలువనెక్కి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యేసుక్రీస్తు త్యాగనిరతి గొప్పదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకుని యేసు క్రీస్తు జీవితంలోని ఆదర్శాలను ఆమె స్మరించుకున్నారు. ఒకరికి మంచి చేయడంలోనే ఎంతో ఆత్మ సంతృప్తి ఉంటుందనే సందేశాన్ని యేసు క్రీస్తు జీవితం మనకు అందిస్తుందని మంత్రి తెలిపారు. క్రీస్తు జీవించిన కాలం ఆధారంగా మానవ చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించేంతగా ఈ భువిపై క్రీస్తు ప్రభావం ఉందని సురేఖ చెప్పారు. క్రీస్తు ఆచరించిన ప్రేమ, సహనం, కరుణ, త్యాగం అనే గుణాలను నిత్య జీవితంలో ఆచరించి యేసును మనలో నిలుపుకోవచ్చని పేర్కొన్నారు. అశాంతితో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి క్రీస్తు బోధనలు సరైన దారి చూపుతాయని మంత్రి సురేఖ తెలిపారు.