ప్రతి రైలులో సాధారణ బోగీలను ఐదుకు పెంచాలి

– రైలులో ఐదు సాధారణ బోగీల సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రతి రైలులో సాధారణ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని రైలులో ఐదు సాధారణ బోగీల సాధన సమితి డిమాండ్‌ చేసింది.ఈ మేరకు సాధన సమితి జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదు సాధారణ బోగీల సాధన కోసం ప్రధానమంత్రికి – దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి రోజు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నట్టు అనధికారికంగా అంచనా ఉండగా, ఈ ప్రయాణంలో జనరల్‌ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని తెలిపారు. సీట్లు తక్కువగా ఉండటం, బోగీల్లో స్థలం లేకపోవడం, తొక్కిసలాటలు, గాయాలు, కొన్ని సందర్భాల్లో తీవ్రగాయాలు, చిన్నారుల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని ఒక సామాజిక బాధ్యతగా, టు, ది ప్రైమ్‌ మినిస్టర్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌, 152, సౌత్‌ బ్లాక్‌, రైసినా హిల్స్‌, న్యూ ఢిల్లీ – 110011, చిరునామాకు ఉత్తరాలు రాసి పంపాలని సూచించారు.