నవతెలంగాణ – రాయపోల్: రైతులు వారు పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధరను పొందాలని ఏపీఎం దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడం కోసం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది అన్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు దళారులను నమ్మి తక్కువ ధరకు దాన్యం విక్రయించి మోసపోవద్దని, ఐకేపీ, పిఎసిఎస్ ఆధ్వర్యంలో గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు అందరు ఆయా కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు. మండల పరిధిలో మొత్తం 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం యాసంగి కాలంలో పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని అన్నదాతలు అధైర్యపడవద్దు అన్నారు. రైతులు పంటను కోసిన వెంటనే తమ పొలాల వద్దనే ఆరాపెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
అధికారులు ధాన్యం తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 41 కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలి అధికంగా తూకం వేసినట్లు తమ దృష్టికి వస్తే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2203/- బి గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2183/- మద్దతు ధరను కేటాయించి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు అధైర్యపడవద్దు పండించిన పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వివోఏలు, గ్రామ సంఘం అధ్యక్షురాలు, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.