ఒక్క ఏడాదిలోనే బీజేపీకి రూ.614.52 కోట్లు..

ఒక్క ఏడాదిలోనే బీజేపీకి రూ.614.52 కోట్లు..– ఈబీలకు ఇవి అదనం
తిరువనంతపురం : 2021-22 ఒక్క ఏడాదిలోనే కార్పోరేట్లు, వ్యక్తులు, ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీ) ఆమోదించని అక్రమ ట్రస్టుల నుంచి బీజేపీ రూ.614.52 కోట్లు సంపాదించింది. ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి సంపాదించిన వేలకోట్లకు ఇది అదనమని దేశాభిమాని పత్రిక వెల్లడించింది.
2022 నవంబర్‌ 7న బీజేపీ ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి సమర్పించిన పత్రాల్లో చాలా మంది దాతల పాన్‌ నెంబర్‌, చిరునామా లేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం రాజకీయ పార్టీలు ఇరవై వేలకు పైగా జమ చేసిన వారి జాబితాను ఈసీకి సమర్పించాల్సి వుంది. ఈసీ ఆమోదించని ఎలక్టోరల్‌ ట్రస్టుల నుంచి బీజేపీ విరాళాలను స్వీకరించినట్టు ఆ పత్రాలు చూపుతున్నాయి. వాటిలో ఒకటి జనరల్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ కేరళ. పది లక్షలు విరాళం అందించిన ఈ ట్రస్ట్‌ పాన్‌ నెంబర్‌, చిరునామా లేవు. అయితే వివరణ కోరకుండా బీజేపీ సమర్పించిన పత్రాలను ఈసీ ఆమోదించడం గమనార్హం. న్యూఢిల్లీలోని బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌లోని హన్స్‌ భవన్‌లో నమోదైన ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ 2021-22లో బీజేపీకి రూ.249 కోట్ల విరాళాలను అందించింది.
మొత్తంగా 4,985 మంది ప్రముఖుల (వ్యక్తులు, సంస్థలు, ట్రస్ట్‌లు) నుండి చెక్‌లు, ఆన్‌లైన్‌, నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఇఎఫ్‌టి)ల ద్వారా బీజేపీకి నగదు బదిలీ చేశాయి. కేరళకు చెందిన సంస్థలు, వ్యక్తులతో కూడిన 27 మంది ప్రముఖుల నుంచి నగదు అందింది. బీజేపీకి కోటి రూపాయలు ఇచ్చిన మహ్మద్‌ మజీద్‌కు సంబంధించిన పాన్‌ నెంబర్‌, చిరునామా లేవు.
ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో దేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంత అవినీతికి పాల్పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించిన వివరాలతో ఈ అక్రమాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.