తాగు నీటికి ఇబ్బందులు రాకుండా చూడాలి: సీఎస్ శాంత కుమారి

నవతెలంగాణ – భువనగిరి
తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వేసవిలో తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనపై, వడదెబ్బ తగలకుండా తీసుకోవల్సిన  జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వేసవికాలం పూర్తి అయ్యి వర్షాలు వచ్చేవరకు తాగు నీటి  సరఫరా అంశంపై అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో తాగు నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ప్రతి జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో వచ్చే ఇబ్బందులను పరిష్కరించేందుకు  అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. పట్టణాలలో ఏర్పడిన నూతన కాలనీలు, చివరి ఆవాస ప్రాంతాలు తాగు నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, పట్టణాలలో,  గ్రామాలలో తాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని పేర్కొన్నారు. రానున్న రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో తాగునీటి  సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గురించి వాటిని సత్వరం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, తాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని, ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సిఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ధాన్యం కొనుగోలు అంశంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ధాన్యం కొనుగోలు  చేసిన వెంటనే త్వరితగతిన రైతుకు చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.  తాగునీటి సౌకర్యం, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకుని రావడం, అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల మైనర్, మేజర్ మరమ్మత్తులు తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు  ప్రతి మండలంలో పనుల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నియమించాలని,  పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి పాఠశాలలో అవసరమైన పనులు పాఠశాలలు ప్రారంభం అయ్యే ముందే పూర్తి చేయాలని సూచించారు. వడదెబ్బ తగిలిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స సత్వరమే అందేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి  ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఉపాధి హామీ పనులను ఉదయం పూట నిర్వహించాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో కార్మికులకు అవసరమైన మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అన్నారు . వడ గాల్పులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, బయటకు వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వడ గాల్పులు గురైన వ్యక్తులను వెంటనే అవసరమైన ప్రధమ చికిత్స చేసి సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జండగే,  జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి. బెన్ షా లోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే. గంగాధర్, అధికారులు పాల్గొన్నారు.