సూపర్‌కింగ్స్‌ 206/4

సూపర్‌కింగ్స్‌ 206/4– దూబె, రుతురాజ్‌, ధోని ధనాధన్‌
నవతెలంగాణ-ముంబయి
చెన్నై సూపర్‌కింగ్స్‌ దంచికొట్టింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (69, 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివం దూబె (66 నాటౌట్‌, 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగగా.. ఎం.ఎస్‌ ధోని (20 నాటౌట్‌, 4 బంతుల్లో 3 సిక్స్‌లు) ధనాధన్‌తో కదంతొక్కాడు. ముంబయి ఇండియన్స్‌పై వాంఖడేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. అజింక్య రహానె (5) ఓపెనర్‌గా నిరాశపరచగా.. రచిన్‌ రవీంద్ర (21, 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబె మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 33 బంతుల్లో రుతురాజ్‌ అర్థ సెంచరీ సాధించగా.. శివం దూబె ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. డార్లీ మిచెల్‌ (17) ఫర్వాలేదనిపించాడు. ఆఖరు ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఎం.ఎస్‌ ధోని (20 నాటౌట్‌) హార్దిక్‌ పాండ్యపై హ్యాట్రిక్‌ సిక్సర్లు కొట్టి వాంఖడేను ఉర్రూతలూగించాడు. ధోని మెరుపు హిట్టింగ్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్య (2/43) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా (0/27) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.