నవతెలంగాణ-తుర్కయంజాల్
భువనగిరి పార్లమెంట్కు పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ నామినేషన్ సందర్భంగా భవన గిరి పట్టణంలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు తుర్కయంజాల్ మున్సిపాలిటీ సీపీఐ(ఎం) పార్టీ నాయ కులు రాగన్నగూడలోని సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయం నుండి శుక్రవారం వాహనాల్లో బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, తుర్కయంజాల్ మున్సిపల్ పార్టీ కన్వీనర్ డి. కిషన్ మాట్లా డుతూ ప్రజా ఉద్యమాల రథసారధి, కార్మిక, కర్షక వారధి, పేదల పెన్నిధి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ను ప్రజలు ఆదరించి అభిమానించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఇతర పార్టీల నాయకులు వారి వారి రాజకీయ, వ్యాపార స్వ ప్రయోజనాల కోసం రోజుకో జెండా మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, వారేనాడు ప్రజా సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ధన ప్రభావంతో, మత విద్వేషాలతో ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని చూసే పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ ర్యాలీలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎంజె ప్రకాష్ కారత్, సీపీఐ(ఎం) పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు ఏం. సత్యనారాయణ, ఐ. భాస్కర్, కొండిగారి శంకర్, ఐ. కష్ణ, కే. వెంకటకష్ణ, జె. ఆశీర్వాదం, కె. అరుణ్ కుమార్, బి. మాల్యాద్రి, కె. సత్యం, యం.యాదయ్య, పి.శ్రీను, సాయి, పల్లె కష్ణ తదితరులు పాల్గొన్నారు.