తాగునీటి ఎద్దడి నివారించాలి

– పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి
– వీడియో కాన్ఫరెన్స్‌ లో సమీక్ష…మండల అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు..
నవతెలంగాణ-అశ్వారావుపేట
వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఎన్నికైన అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు పనులు చేయించే విధానంపై బుధవారం ఐడీఓసి కార్యాలయం సమావేశ మందిరంలో డీఆర్‌డీఓ విద్యా చందనతో కలిసి నీటిపారుదల, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, పీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, ఈఈలతో వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 643 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన పనులు అన్నింటిని రేపటి కల్లా ప్రారంభించి, మే నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి సంబంధించిన ప్రణాళికలను అన్ని శాఖల సమన్వయంతో సమర్పించాలని ఆదేశించారు. కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలో తాగునీరు, తరగతి గదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పని ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పటికీ పూర్తి అవుతుందో కచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మే 31 లోగా మంజూరు అయిన ప్రతి పని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఎలక్ట్రికల్‌, త్రాగునీరు, టాయిలెట్‌ మొదలగు పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పని మొదలుపెట్టే ముందు పూర్తి అయిన తర్వాత ఫొటోస్‌ ఆప్‌ లో అప్లోడ్‌ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జాతీయ బ్యాంకులలో కమిటీల ఖాతాలు తెరిపించాలని అన్నారు. ప్రతిరోజు పనుల పురోగతిపై నివేదికలు అందజేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మందికి తగ్గకుండా ఉపాధి హామీ పనులు చేపట్టాలని, ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు పరిశీలించాలని, నీటి సరఫరాకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఏదైనా సమస్య తలెత్తిన యెడల సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో అధిక ఉష్ణోగ్రతల దష్ట్యా రానున్న రోజుల్లో అత్యవసరమైతే తప్ప సెలవులపై వెళ్లరాదని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో గాలి దుమ్ములు వచ్చే అవకాశం ఉన్నందున మున్సిపల్‌ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్‌ లు శుభ్రంగా వుండు విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులు ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపిఈఒ సీతారామరాజు, ఐబిఏఈ కేఎన్బీ క్రిష్ణ, మిషన్‌ భగీరథ ఇంట్రా ఏఈ లక్ష్మి, విద్యాశాఖ అకడమిక్‌ ఎం.ఎన్‌.ఒ, మామిళ్ళవారిగూడెం జెడ్‌.పి.హెచ్‌.ఎస్‌ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్‌ రావు, పశు సంవర్ధక శాఖ ఏడీ ఎం.వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు.