ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం

PM Modi's comments are painful– మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచిపెడతారనడం అన్యాయం
– ప్రజల ఆస్తులు సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ లాక్కుంటున్నాయని మోడీ దుష్ప్రచారం
– ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న బీజేపీని ఓడించండి
– దానం నాగేందర్‌కు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు : గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యకర్తల సమావేశంలో పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు
– త్యాగాలు, పోరాటాల్లో కమ్యూనిస్టుల పాత్ర వెలకట్టలేనిది
– అమిత్‌ షా వీడియోపై సీఎంకు నోటీసులివ్వడం దారుణం : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళల మెడలో మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచి పెడతారని ప్రధాని మోడీ మాట్లాడటం అన్యాయమని, ప్రధాని తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించట్లేదని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. దశాబ్దాలుగా దేశాన్ని కాంగ్రెస్‌ పాలించిందని, మరి మహిళల మంగళసూత్రాలు లాగేసుకున్నదా? పుస్తెలతాడు, మంగళసూత్రం గురించి మోడీకి ఏమైనా అవగాహన ఉన్నదా? అనే అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌  పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి దానం నాగేందర్‌ గెలుపు కోసం గోల్కొండ చౌరస్తాలోని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా.. రాఘవులు మాట్లాడారు.
గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరకపోవడంతో బీజేపీకి లాభించిందన్నారు. ఈసారి దేశంలో 28 సెక్యులర్‌ పార్టీలు ఒకే వేదిక మీదికి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని, బీజేపీని ఓడించి ప్రత్యామ్నాయంగా సెక్యులర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇండియా కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, ఒకటి, రెండో దశ పోలింగ్‌లో బీజేపీకి ప్రతికూలత ఉన్నట్టు గ్రహించడంతో ప్రధాని మోడీ.. మంగళ సూత్రాలు, హిందువుల సంపాదన మైనార్టీలకు పంచిపెడుతారనే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అంతేగాక ప్రజల ఆస్తులు లాక్కుంటున్నాయని సీపీఐ(ఎం), కాంగ్రెస్‌పై మోడీ దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజల ఆస్తుల్ని అదానీ, అంబానీ, కార్పొరేట్‌ కంపెనీలకు ఊడ్చి పెట్టింది మీరే కదా అని ప్రశ్నించారు. పదేండ్లలో ట్రైలర్‌ మాత్రమే చూశారని.. అసలు సినిమా చూపిస్తామంటున్న మోడీ మాటలు బెదిరించడమేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నాయకుల్ని, జర్నలిస్టులను జైల్లో వేయడం ద్వారా బీజేపీ నిరంకుశ పాలన సాగించిందన్నారు. రిజర్వేషన్లపై సమీక్ష చేస్తామంటూ గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చెప్పిన మాటల అర్థం ఏమిటి.. సమీక్ష పేరుతో రద్దు చేయడమేనన్నారు. ముస్లింల రిజర్వేషన్లే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు సైతం భవిష్యత్‌లో ఆ పార్టీ రద్దు చేస్తుందన్నారు. గడిచిన పదేండ్లలో ప్రజల ఆదాయాలు 30శాతమే పెరిగితే.. ఖర్చులు మాత్రం 67 శాతం పెరిగాయని తెలిపారు. సీఏఏ పేరుతో మైనార్టీలకు పౌరసత్వ హక్కుల్ని నిరాకరించేందుకు బీజేపీ ప్రభుత్వం పూనుకుందని, మత రాజకీయాలు దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
దానం నాగేందర్‌ శక్తిసామర్థ్యాలు కలిగిన వారు.. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని అన్నారు. దానం నాగేందర్‌ లాంటివారు పార్లమెంట్‌లో కచ్చితంగా ఉండాల్సిన నాయకుడని .. ఆయన్ని గెలిపించేందుకు సీపీఐ(ఎం) శక్తి మేరకు కృషి చేస్తుందని అన్నారు.దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. త్యాగాలు, పోరాటాలు చేయడంలో, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కమ్యూనిస్టుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. విద్యుత్‌ పోరాటమే అందుకు ఉదాహరణగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో తనకు సీపీఐ(ఎం) మద్దతు ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు. ఎన్డీయే కూటమికి అధికారమిస్తే.. పదేండ్ల కాలంలో దేశ ప్రజలను కులం, మతం పేరిట విడగొట్టే ప్రయత్నాలు చేసిందన్నారు. దేశ ప్రధాని హోదాలో మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ఎన్నో మార్ఫింగ్‌ వీడియోలు వచ్చాయని గుర్తుచేశారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకో వడంతోనే.. అమిత్‌ షా మార్ఫింగ్‌ వీడియోను చూపి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని లొంగదీసుకోవాలని, భయందోళనకు గురిచేయడానికి హడావుడిగా నోటీసులు ఇచ్చారని విమర్శించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ ప్రాంత సమస్యలను త్వరితగతి న పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి. నర్సింహారావు, పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణజ్యోతి, గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్ర ల్‌ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌ ్‌రావు, దశరథ్‌, ఎం.మహేందర్‌, ఎం.వెంకటేష్‌, కె.నాగలక్ష్మి, రాజన్న,్ల, కార్యకర్తలు పాల్గొన్నారు.