టీఎస్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

టీఎస్‌ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల– ఈ నెల 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చరర్ల ఉద్యోగాల అర్హత పరీక్ష టీఎస్‌సెట్‌ 2024కు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. శనివారం హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలోని టీఎస్‌ సెట్‌ కార్యాలయంలో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ ప్రొ. రవిందర్‌యాదవ్‌, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.ఎస్‌.మల్లేశ్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొ. రెడ్యానాయక్‌, సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ జి.నరేష్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ నరేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో 29 సబ్జెక్ట్‌లలో సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈనెల 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఉమ్మడి 10 జిల్లా కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు సెంటర్స్‌ను ఎత్తేశారు.గతంలో మాదిరిగానే పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌జెండర్స్‌కు రూ.1000, బీసీలకు రూ.1500, ఓసీలకు రూ.2000గా నిర్ణయించారు. ఆసక్తి గల వారు జులై 2వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో జులై 26వ తేదీ వరకు సమయం ఉంటుంది. ఆగస్టు 20 తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 2023లో నిర్వహించిన టీఎస్‌ సెట్‌కు 33,866 మంది దరఖాస్తులు చేసుకోగా, 2,278 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.