– ముగిసిన మూడో దశ ప్రచార పర్వం
– 12 రాష్ట్రాల్లో 95 స్థానాలకు పోలింగ్
– మొత్తం 1,351 మంది అభ్యర్థులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ రేపు (మంగళవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ దశలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,351 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా (గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), బీజేపీ తిరుగుబాటు నాయకుడు కెఎస్ ఈశ్వరప్ప(షిమోగా), డింపుల్ యాదవ్ (మెయిన్పురి), శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ), సుప్రియా సులే (బారమతి) తదితరులు ఉన్నారు. అలాగే ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సమాజవాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోరు జరగనుంది. మరోవైపు ఇప్పటికే ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఇక ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ పూర్తి అయింది. ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుంది.