ఎన్నికలు సజావుగా సాగేలా భారీ బందోబస్తు : సీపీ తరుణ్‌ జోషి

నవతెలంగాణ- హైదరాబాద్‌
నేడు జరగనున్న లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లను, ఎన్నికల నిర్వహణ, సైనిక్‌ పురి భవన్స్‌ కళాశాల, సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం, గుర్రగూడలోని స్ఫూర్తి కళాశాల, మేడ్చల్‌లోని హౌలీ మేరీ కళాశాలలోని ఎన్నికల ఏర్పాట్లను రాచకొండ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఐపీఎస్‌ పరిశీలించారు. అక్కడి స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ కేంద్రాలకు సబంధించిన భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్ట్రాంగ్‌ రూమ్‌ నిర్వహణ, భద్రత ఏర్పాట్లు, స్ట్రాంగ్‌ రూము నుండి కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకునే మార్గంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, అక్కడ ఏర్పాటు చేయాల్సిన గార్డు వ్యవస్థ గురించి సూచనలు చేశారు. కౌంటింగ్‌ ఏజెంట్లు మరియు కౌంటింగ్‌ అధికారులు కలవకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మెటల్‌ బారికేడ్‌ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు వివరించి, వాటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక సూచనలు ఇచ్చారు. అవసరాన్ని బట్టి పలు వరుసలలో కౌంటింగ్‌ టేబుల్లు, రిసెప్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. కమిషనర్‌ వెంట ఎల్బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌ కుమార్‌ ఐపీఎస్‌, మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఐపీఎస్‌, ఏసీపీలు, ఇతర అధికారులు ఉన్నారు.