టీఎస్‌కు బదులుగా టీజీ : సీఎస్‌ ఉత్తర్వులు జారీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్‌ బదులుగా టీజీగానే ప్రస్తావించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, అటానమస్‌ విభాగాలన్నింటిలోనూ వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్‌ హెడ్‌లలో టీజీ అనే పేర్కొనాలని ఉత్తర్వుల్లో సీఎస్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్‌ సైట్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలలోనూ టీజీ ఉండాలన్నారు. టీఎస్‌ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్‌ మెటీరియల్‌ను తొలగించి.. టీజీతో కొత్తగా ముద్రించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు అమలు చేసి ఈనెల 31 నాటికి సాధారణ పరిపాలన శాఖకు నివేదిక సమర్పించా లని వివిధ శాఖల కార్యదర్శులను సీఎస్‌ ఆదేశించారు.