విక్రాంత్, చాందినీ చౌదరి హీరో, హీరోయిన్లుగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా శనివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ప్లే రాస్తున్నారు.
ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, వ్యాపార వేత్త అంబికా కష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ ఇచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాతలిద్దరూ స్క్రిప్ట్ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ‘మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్కు రావడం లేదు. వాళ్లను రప్పించేలా ఈ మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఒక కాంటెంపరరీ ఇష్యూని కథలో చూపిస్తున్నాం. వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా మూవీలో చూపిస్తున్నాం’ అని తెలిపారు.
‘ఇదొక మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సునీల్ కశ్యప్ మా చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి మా సినిమా రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభిస్తాం. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’ అని నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి అన్నారు.