
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆనాడు పటేల్ పట్వారీ దొర బాంచెన్ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. ఎన్టీ రామారావు జయంతి సందర్బంగా మంథని పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళర్పించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల విగ్రహాల వెనుక దాగి ఉన్న చరిత్రను తెలియజేయాలనే ఆలోచనతో మంథనిలో విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఆనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు నేలవంక కింద చూసి నడిచే వారని కనీసం పెద్దవాళ్లను తల ఎత్తి చూసేవారు కాదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చిన చరిత్ర ఎన్టీఆర్దేనన్నారు. ఈనాడు బీసీలు రాజకీయంగా ఇంత ఎత్తు ఎదిగారంటే అందుకు ఎన్టీ రామారావు కారణమన్నారు. ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస పార్టీ తమ చెప్పు, చేతల్లో ఉండే వాళ్లను మాత్రమే రాజకీయంగా వాడుకునే వారని, ఎస్సీల్లో రిజర్వేషన్లు ఉన్నా స్వతంత్ర ఆలోచన శక్తి ఉండేది కాదన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఎస్సీలను ముందుకు తీసుకువచ్చి రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మనం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు.