నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పదవీ వ్యామోహం, అధికార దాహంతో కనీస విలువలకు తిలోదకాలిచ్చే నాయకుల సంఖ్య నేటి రాజకీయాల్లో ఎక్కువగా పెరిగిపోతోంది. అయితే ఆ రకంగా విలువలను వదిలేసి.. ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి గోడదూకిన వారిలో మెజార్టీ అభ్యర్థులను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీలో చేరి బరిలోకి దిగిన వలస నేతలు బీబీ పాటిల్(జహీరాబాద్), పోతుగంటి భరత్(నాగర్ కర్నూల్), శానంపూడి సైదిరెడ్డి(నల్గొండ), గోమాస శ్రీనివాస్(పెద్దపల్లి),ఆరూరి రమేశ్(వరంగల్) సీతారాంనాయక్(మహబూబాబాద్) పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం రంజిత్రెడ్డి(చేవెళ్ల), దానం నాగేందర్(సికింద్రాబాద్), పట్నం సునీతారెడ్డి(మల్కాజిగిరి), నీలం మధు(మెదక్) ఓటమిపాలయ్యారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నాగర్ కర్నూల్లో మూడో స్థానానికి పడిపోవటం గమనార్హం.