– ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ – ముషీరాబాద్
డ్రయినేజీ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను ఆదేశించారు. కవాడిగూడ డివిజన్ దోమలగూడ ఫుల్ బాగ్ కూచిపూడి గ్రౌండ్ వద్ద రూ. 17 లక్షల వ్యయంతో నూతన డ్రయినేజీ పనులను సానిక కార్పొరేటర్ రచన శ్రీ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల కోడ్ ముగిసిన సందర్భంగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వాటిని త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. డ్రయినేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికరించి డ్రయినేజీ నీరు రోడ్లపై ప్రవహించకుండా చూస్తామన్నారు. ప్రజలు ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మచ్చ కనిర్తి ప్రభాకర్, రాజశేఖర్ గౌడ్, కల్వ గోపి, మధు, రాములు, రమేష్, బీజేపీ నాయకులు వెంకటేష్, డివిజన్ అధ్యక్షుడు మహేందర్, సలేంద్ర శ్రీనివాస్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.