జాతీయ సమైక్యతలో పశ్చిమబెంగాల్‌ కీలకపాత్ర

– గవర్నర్‌ సీ.పీ.రాధాకృష్ణన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వాతంత్య్ర పోరాటం, భారతీయ తాత్వికత, జాతీయ సమైక్యత కోసం పశ్చిమబెంగాల్‌ కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర గవర్నర్‌ సీ.పీ.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి శ్రీఅరబిందో, శ్రీరామకృష్ణపరమ హంస తదితర ప్రముఖులు వచ్చారని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ లో నిర్వహించిన పశ్చిమబెం గాల్‌ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫుట్‌బాల్‌, క్రికెట్‌ వంటి క్రీడల్లోనూ ఆ రాష్ట్రం అమోఘమైన పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణకు, పశ్చిమబెంగాల్‌కు మధ్య సుదీర్ఘమైన సాంస్కృతిక సంబంధాలున్నాయని కొనియాడారు. అనంతరం పలువురు బెంగాలీ ప్రముఖులను గవర్నర్‌ సత్కరించారు. వేడుకల్లో కళాకారులు బెంగాలీ నృత్య ప్రదర్శనలిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, రాజ్‌భవన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.