నవతెలంగాణ- దంతాలపల్లి
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సంరద్భంగా ప్రభుత్వం ముదిరాజ్ కులాన్ని అవమానించిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం అందజేసే జాబితాలో ముదిరాజ్ కులాన్ని పొందపర్చకపోవడంలో ఆంతర్యం ఏమిటని ముదిరాజ్ ఎంప్లాయీస్అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చిల్ల నిరంజన్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ముదిరాజ్లకు బీసీ కులాల్లో లేరా..? ముదిరాజ్లకు కుల వృత్తి లేదా అని ప్రశ్నించారు. వృత్తిదారులకే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం స్వాగతనీయమని, అందులో ముదిరాజ్లను విస్మరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అధిక ఓటింగ్ శాతాన్ని కలిగి ఉన్న ముదిరాజ్లను బీసీ సంక్షేమ శాఖ ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదో సమాధానం చెప్పాలని అన్నారు. రూ.లక్షసాయం అందించే కులాల జాబితాలో వెంటనే ముదిరాజ్ కులాన్ని కూడా చేర్చి ఉత్తర్వులు జారీ చేయాలని, అప్పటి వరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే సవరింపు ఉత్తర్వులు జారీచేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. కనీసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అయినా ముదిరాజ్లకు న్యాయం జరుగుతుందని భావిస్తే, ఇప్పుడు కూడా అన్యాయమే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ముదిరాజ్లకు కనీసం చేపల వేటకు వెళ్లడానికి కావాల్సిన పరికరాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, ఇది ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముదిరాజ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కావాలనే జాబితాలో చేర్చలేదని విమర్శించారు. ఏ స్థాయిల తప్పిదం జరిగింతో సమీక్షించి వెంటనే ముదిరాజ్లకు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం అందించేలా నిబంధనలు రూపొందించాలని కోరారు.