కేంద్రాన్ని నిలదీస్తాం

– అఖిలపక్ష సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రప్రభుత్వ విధానాలు, వివక్ష, నిధుల కేటాయింపు అంశాలపై నిలదీస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ నేత కే కేశవరావు తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలను తాము లేవనెత్తామని వారు మీడియాకు చెప్పారు. తెలంగాణాపై కుట్రలు సహించబోమన్నారు. రైతు, ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబడతామనీ, గవర్నర్లను అడ్డుపెట్టుకొని చేస్తున్న రాజకీయ కుట్రలను ఛేదిస్తామని చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీలపై అఖిల పక్ష సమావేశంలో చర్చకు పట్టుబట్టామన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళ రిజర్వేషన్‌ బిల్లు అంశాలను బడ్జెట్‌ సమావేశాల్లో తప్పకుండా లెవనెత్తుతామని స్పష్టంచేశామన్నారు. బిల్లుల ఆమోదం మీదే కాదనీ, దేశ సమస్యలపైనా దష్టి పెట్టాలని కేంద్రానికి చెప్పామన్నారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ షేర్లు పడిపోవడాన్ని కూడా సభలో లెవనెత్తామని తెలిపారు.